పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు 2019
యాజమాన్య కమిటీలకు ఎన్నికల నగారా
రెండు పర్యాయాలు పదవీ కాలం పొడిగించిన పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికకు నగారా మోగింది. ప్రతి రెండేళ్లకు ఎన్నికలు జరగాల్సి ఉండగా గత పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగిస్తూ వచ్చారు. కాగా తాజాగా ఎన్నికల గంట మోగింది. విద్యాహక్కు చట్టం-2009లోని సెక్షన్ 21(1) ప్రకారం ప్రతి పాఠశాల నిర్వహణకు ఒక యాజమాన్య కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ఎన్నికల ముఖ్య తేదీలు ఇవే!
- ఈ నెల 22న పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక కోసం ప్రకటన వెలువడుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఓటరు జాబితా ప్రదర్శన ఉంటుంది.
- 23 నుంచి 25 వరకు ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది
- 26న 11 గంటలకు తుది ఓటరు జాబితా వెల్లడిస్తారు
- 30న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సభ్యులను ఎన్నుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం అనంతరం 2 గంటలకు నూతన కమిటీతో తొలి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.
సభ్యుల ఎన్నిక ఇలా..
- ప్రతి తరగతి నుంచి ముగ్గురు సభ్యుల చొప్పున ఎన్నుకోవాలి. ఒక తరగతిలో ఆరుగురి కంటే తక్కువ ఉంటే, ఎగువన, దిగువన ఉన్న తరగతిని కలిపి సభ్యులను ఎన్నుకోవాలి.
- వీరిలో ఇద్దరు మహిళలు ఉండాలి. ముగ్గురిలో కనీసం ఒక వ్యక్తి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వారై ఉండాలి. అంటే అనాథ, ఎస్సీ, ఎస్టీ, వలసల, వీధి బాలల, ప్రత్యేక అవసరాల, హెచ్ఐవీ బారిన పడ్డ పిల్లల తల్లిదండ్రులలో ఒకరిని ఎన్నుకోవాలి. మరొకరిని బలహీన వర్గాలకు చెందిన(బీసీ, మైనారిటీ, వార్షికాదాయం రూ.60 వేల లోపు ఉన్న ఓసీలు) వారి నుంచి ఎన్నుకోవాలి.
- మరొకరు సాధారణ కేటగిరీకి చెందిన ఎవరినైనా ఎనుకోవచ్చు.
ఇదీ ఎన్నిక విధానం
- ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ తరగతుల్లో పిల్లలు చదివితే ప్రతి తరగతి ఎన్నికలోనూ ఎవరో ఒకరే పాల్గొనే వీలుంటుంది.
- 50 శాతం తల్లిదండ్రులు సమావేశానికి హాజరు కాకుంటే కోరం లేనట్లు భావించి ఎన్నికలు వాయిదా వేస్తారు.
- ఎన్నికల సమయంలో స్థానిక పరిస్థితులను బట్టి చేతులు ఎత్తడం, మూజువాణి ఓటు, రహస్య బ్యాలట్ పద్ధతి ఏదైనా ఎంచుకునే వీలుంది.
- ఈ ఎన్నికలకు మెంబర్ కన్వీనర్గా ప్రధానోపాధ్యాయులు నిర్వహిస్తారు.
- పాఠశాలలో రెండు మాధ్యమాలు ఉన్నా ఒకే కమిటీ ఉంటుంది.
కో ఆప్షన్ సభ్యులు
- పాఠశాల అభివృద్ధికి సహకరించే విద్యావేత్తలు, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు, దాతలు, కో ఆప్టెడ్ సభ్యులుగా ఇద్దరిని నియమించుకోవాలి.
- ఆవాస ప్రాంత పరిధిలోకి వచ్చే సర్పంచి, మున్సిపల్ ఛైర్మన్, మేయర్లు ఈ సంఘం సమావేశాలకు హాజరు కావచ్చు.
సభ్యుల సంఖ్య ఇలా..
- ఆయా పాఠశాలల్లో తరగతులను బట్టి ప్రాథమిక పాఠశాలలో 1-5 తరగతుల వరకు ప్రతి తరగతికి ముగ్గురి చొప్పున 15 మంది తల్లిదండ్రుల నుంచి ఎన్నికైన వారు, ఆరుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు, ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు కలిపి మొత్తం 23 మంది సభ్యులు ఉంటారు.
- ప్రాథమికోన్నత పాఠశాలల్లో 7వ తరగతి వరకు ఉంటే తల్లిదండ్రుల సభ్యులు 21 మందితో ఎక్స్ అఫీషియో, కోఆప్టెడ్ కలిపి 29 మంది, 8వ తరగతి వరకు ఉంటే ఈ సంఖ్య 32 వరకు ఉంటుంది.
- ఉన్నత పాఠశాలల్లో 6-8 మూడు తరగతులకు కలిపి 9 మంది పోషక సభ్యులతో సహా 17 మంది ఉంటారు.
ఎక్స్ అఫీషియో సభ్యులు ఎవరు?
- ఎన్నికైన సభ్యులే కాకుండా ఈ కమిటీకి ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్గా వ్యవహరిస్తారు. వీరితో పాటు ఆరుగురు ఇతర సభ్యులు ఉంటారు. అందులో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు ఉంటారు.
- ప్రధానోపాధ్యాయులు పురుషులు అయితే ఈ స్థానంలో ఉపాధ్యాయురాలికి ప్రాధాన్యం ఉంటుంది.
- మహిళ ఉంటే సీనియర్ ఎవరైనా ఉండవచ్చు. ఆ పాఠశాల ఏ వార్డు పరిధిలోకి వస్తే ఆ వార్డు సభ్యులు/కౌన్సిలర్/కార్పొరేటర్ సభ్యులుగా ఉంటారు.
- ఏఎన్ఎం, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు.
Type your Comment
comment url